పవన్ బీజేపీకి దగ్గరయ్యేందుకు సంకేతాలు ఇస్తున్నాడు: రాజు రవితేజ

  • జనసేనకు వీడ్కోలు పలికిన రాజు రవితేజ
  • మీడియా సమావేశంలో పవన్ పై వ్యాఖ్యలు
  • సొంత పార్టీలోనే పవన్ ను ఎక్కువగా వ్యతిరేకిస్తారని వెల్లడి
ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్లో బీజేపీ, మోదీ, అమిత్ షా అనుకూల వ్యాఖ్యలు ఎక్కువగా ఉంటున్నాయి. దీనిపై జనసేన మాజీ నేత రాజు రవితేజ స్పందించారు. నిన్ననే పార్టీకి రాజీనామా చేసిన రవితేజ మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీకి దగ్గరకావాలని పవన్ సంకేతాలు ఇస్తున్నారని వెల్లడించారు. కానీ రైట్ సైడ్ చూపించి లెఫ్ట్ సైడ్ వెళతారా? స్ట్రెయిట్ గా వెళతారా? ఎవరికీ తెలియదని అన్నారు. ప్రజలకు సేవలందించాల్సిన పార్టీని స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు.

ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత వివాదాలను మాట్లాడి పార్టీలోనే అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారని, కోపంతో, ద్వేషంతో పవన్ చేసిన ప్రసంగాల కారణంగా నిజమైన మద్దతుదారులు కూడా పార్టీకి దూరమయ్యారని రాజు రవితేజ వెల్లడించారు. వాస్తవానికి పవన్ కల్యాణ్ ను ఇతర పార్టీల వారికంటే సొంత పార్టీ వాళ్లే ఎక్కువగా ద్వేషిస్తుంటారని అన్నారు. ఇటీవల కాలంలో పవన్ వైఖరి చూస్తుంటే, సమస్య లేని చోట సమస్యను సృష్టించే విధంగా తయారయ్యారని ఆరోపించారు. కులం పేరిట పవన్ చేస్తున్న వ్యాఖ్యలు అమాయకులైన అభిమానుల్లో తప్పుడు బీజాలు నాటుతున్నాయని, అభిమానులు పవన్ చెప్పిందే నిజమని నమ్మితే జరిగే పరిణామాలకు బాధ్యులెవరని ప్రశ్నించారు.
Go Back to Shorts
Pawan Kalyan
Jana Sena
Raju Raviteja
Andhra Pradesh
Telangana
BJP

More Telugu News